కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి చంద్రబాబు ప్రయత్నాలు.. సోనియాతో రహస్య మంతనాలు: సోము వీర్రాజు ఫైర్

  • చంద్రబాబుపై మరోమారు విరుచుకుపడిన సోము వీర్రాజు
  • ఎక్కువ సీట్లు అడుగుతామనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చారన్న బీజేపీ నేత
  • చిన రాజప్ప డమ్మీగా మారారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఫైరయ్యారు. కర్నూలులో ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడుగుతామనే ఉద్దేశంతోనే ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చంద్రబాబు రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు. గతంలో మోదీని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆయనను తిడుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అవినీతిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు రావడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధిని అమరావతికే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప డమ్మీగా మారారని, రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యే అనధికారికంగా హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Go Back to Shorts
somu veerraju
Andhra Pradesh
BJP
Chandrababu
Sonia Gandhi
Congress

More Telugu News